ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) రఘునందన్ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితో పాటు, DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్) అనుమతీ తప్పనిసరి. ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్ల జాబితాను రివ్యూ కమిటీ పరిశీలించి, అనుమతిని కేంద్రానికి పంపిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రభాకర్ రావు నేతృత్వంలోని SIB విభాగం సుమారు 618 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ కోసం రివ్యూ కమిటీకి సమర్పించింది. అప్పట్లో సీఎస్గా ఉన్న శాంతి కుమారి DOTకి ఆ లిస్ట్ పంపి టెలికం అనుమతులు తీసుకున్నట్లు SIT దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అదే కేసులో అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్ మరియు ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్లకు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేయగా, తాజాగా శాంతి కుమారి, రఘునందన్ రావులను స్వయంగా విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు మరింత లోతుగా సాగుతున్న దశలో, ఈ రెండు స్టేట్మెంట్లు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.