పింఛను సంబంధిత విధివిధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి ముందుగా కొంత సున్నితమైన ప్రక్రియ పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రధాన సూచనలు..
అనర్హులుగా గుర్తించిన వారికి ముందుగా నోటీసులిచ్చి వివరణ కోరాలని, వారి సమాధానం ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. లబ్ధిదారుల వివరణ పునరాలోచనకు అనుకూలంగా ఉంటే పెన్షన్లు కొనసాగుతాయని, లేదంటే రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నోటీసులకు స్పందించని వారి పింఛన్లు హోల్డ్లో పెట్టాలని నిర్ణయించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఆరు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. మరో 3 లక్షల మంది వరకు అనర్హుల జాబితాలోకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, పెన్షన్ల తొలగింపు విధానంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారనే పండుటాకులపై కూటమి పంతం సాధిస్తోందని ఆరోపిస్తున్నారు.








