ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తీరిక లేకుండా గడుపుతున్నారు. రాజకీయ కార్యక్రమాల మధ్య చిన్న విరామం దొరికినా, షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో పాటు, ‘ఓజీ’ షూటింగ్లోనూ పవన్ జాయిన్ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ సంగారెడ్డి జిల్లాకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలంటే, ఈ కథనం చదవాల్సిందే. ఎప్పుడూ రాజకీయాలు, సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్, నేడు (జూన్ 14న) ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ (ICRISAT) ప్రాంగణంలో ఉన్న **ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH)కు వచ్చారు. తన చిన్న కొడుకు మార్క్ శంకర్ అడ్మిషన్ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్, కాసేపు అక్కడే ఉండి స్కూల్ను పరిశీలించారు.
ఇటీవల మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతుండగా, అక్కడ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. అప్పటి నుండి అతను హైదరాబాద్లోనే ఉంటున్నాడు. తిరిగి స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మార్క్ శంకర్ను ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇక్రిశాట్ ప్రాంగణంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖుల పిల్లలు చదువుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన చిన్న కొడుకును ఇందులోనే చేర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ సిబ్బంది కూడా పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మీడియాను కూడా అనుమతించలేదు.