గత ఆరేళ్లలో రాష్ట్రంలో విపరీత స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఆరేళ్ల కాలంగా దాదాపు లక్షా 30 వేల ఎర్రచందనం (Red Sandalwood) చెట్లు నరికివేయబడ్డాయి, వీటి అంచనా విలువ సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో స్మగ్లింగ్ (Smuggling) జరిగినా, ఆ సమయంలో ఉన్న మంత్రులు ఒక్కరూ బాధ్యత వహించలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తిరుపతి (Tirupati) జిల్లా మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ పర్యటించారు. మంగళంలోని ఎర్రచందనం గోదాంను పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు.
“కర్నాటక ప్రభుత్వం (Karnataka Government) ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకుని విక్రయించడం ద్వారా రూ.140 కోట్ల ఆదాయం సంపాదించింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎర్రచందనం దోపిడీని అరికట్టడంలో విఫలమయ్యారు. ఈ చెట్లు పర్యావరణానికి అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత” అని స్పష్టం చేశారు.
ఎర్రచందనం రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (Task Force)ను ఏర్పాటు చేశామని, స్మగ్లింగ్ నిరోధానికి కర్ణాటక రాష్ట్రంతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలన్న ప్రతిపాదనను సీఎంకు తెలియజేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. “ఏ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు చెందిన ఎర్రచందనం దొరికినా, మనకు అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకోవాలని కోరాం” అని చెప్పారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఎర్రచందనం రవాణా అత్యధికంగా జరుగుతోందని, ఇప్పటికే నలుగురు కింగ్పిన్లను గుర్తించామని, అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నవారిని వదలము. చెట్లు నరికివేసి వేల కోట్లు సంపాదించిన వారిని చట్టం ముందు నిలబెడతాం” అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.








