రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో మాల్ ఏర్పాటు, మల్లవెల్లి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం కూటమి ప్రభుత్వం లులూతో కొత్తగా ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనే పవన్ స్పష్టంగా లులూ సంస్థపై తన అనుమానాలు, అభ్యంతరాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
కేబినెట్ మీటింగ్ సమయంలో పవన్ చేసిన ప్రధాన ప్రశ్న – “లూలూ సంస్థ గోమాంసం ఎగుమతి చేస్తుందా?” అన్నది. రాష్ట్ర ప్రజల భావాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశం క్లారిటీ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. అదేవిధంగా లులూ సంస్థ పెట్టుబడుల కంటే షరతులు ఎక్కువగా పెడుతోందని, రాష్ట్రానికి లాభం కంటే భారం ఎక్కువవుతుందనే ఆందోళనను కూడా పవన్ తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై సీఎం సీరియస్గా ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగినా, చివరకు ప్రభుత్వ నిర్ణయం మాత్రం పూర్తి భిన్నంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణ్ లులూ గురించి అడిగిన సందేహాలను పట్టించుకోకుండా ఎంవోయూ కుదుర్చుకోవడంపై జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విశాఖలో వందల కోట్ల విలువైన భూములను లులూ కంపెనీకి తక్కువ ధరలకు అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం కూడా విమర్శల కేంద్రబిందువైంది. పెట్టుబడుల పేరిట ప్రభుత్వ ఆస్తులను అంత తక్కువ రేట్లకు ఎందుకు ఇస్తున్నారు? రాష్ట్రానికి ఎంతలాభం? అనే ప్రశ్నలు ప్రతిపక్షంతో పాటు ప్రజల్లో కూడా వినిపిస్తున్నాయి. పవన్ అభ్యంతరాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎంవోయూ పై మొగ్గు చూపడం రాజకీయ సందేశాన్ని స్పష్టంగా ఇస్తోందనే అభిప్రాయం పెరుగుతోంది.








