బిహార్ రాజధాని పాట్నా (Patna)లో వెలుగులోకి వచ్చిన ఓ సంచలన విషయం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత విద్య కోసం, నీట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనే ఆశతో అనేక మంది అమ్మాయిలు పాట్నాకు వస్తుంటారు. కానీ, కొన్ని బాలికల హాస్టళ్లలో (Girls Hostels) చదువు ముసుగులో సంఘటిత లైంగిక అక్రమ రవాణా (ఫ్లెష్ ట్రేడ్) (Flesh Trade) నడుస్తోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
అమాయక యువతులు బలి?
హాస్టల్ జరుగుతున్న అక్రమాలపై బయటపడుతున్న వివరాలు భయానకంగా ఉన్నాయి. చదువు కోసం హాస్టళ్లలో చేరిన అమ్మాయిలే ఈ రాకెట్కు లక్ష్యంగా మారుతున్నారు. మొదట చిన్న పనుల పేరుతో, ఆ తర్వాత మెల్లగా అక్రమ కార్యకలాపాల్లోకి నెట్టుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎదురు తిరిగితే మానసిక వేధింపులు, బెదిరింపులు, కొన్నిసార్లు డబ్బు, మాయమాటలతో మోసం చేస్తున్నట్లు సమాచారం.
ఏజెంట్ల అమానుషత్వం
ఈ అక్రమ రాకెట్లో పనిచేస్తున్న ఏజెంట్ల వ్యవహారం మానవత్వానికే మచ్చ తెప్పిస్తోంది. వయస్సు, శారీరక ఆకృతి ఆధారంగా “రేట్లు నిర్ణయిస్తాం” అని ఏజెంట్లు బహిరంగంగా చెప్పినట్లు ఆరోపణలున్నాయి. తక్కువ వయసు బాలికలకు ఎక్కువ ధరలు పెట్టడం ఈ నేరాన్ని మరింత ఘోరంగా మారుస్తోంది. మైనర్ల వయసు దాచేందుకు నకిలీ గుర్తింపు పత్రాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్లు తమ వ్యవస్థను “డెలివరీ సిస్టమ్”లా నడుపుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అనుమానం రాకుండా ఉండేందుకు పగటిపూటే అమ్మాయిలను తీసుకెళ్లి, నిర్దిష్ట సమయానికి తిరిగి హాస్టల్కు చేర్చుతున్నట్లు సమాచారం.
హాస్టల్ వార్డెన్ల పాత్రపై అనుమానాలు
ఈ వ్యవహారంలో హాస్టల్ వార్డెన్ల పాత్ర కూడా అనుమానాస్పదంగా మారింది. కొందరు వార్డెన్లు చిన్న మొత్తాల లంచాలతో “మ్యానేజ్” అవుతూ, అక్రమ రాకెట్కు అడ్డుకట్ట వేయకుండా సహకరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అండర్కవర్ దర్యాప్తు, హిడెన్ కెమెరాల ద్వారా ఏజెంట్లు, కొందరు వార్డెన్లు, అలాగే బాధితులు కూడా ఈ అక్రమ వ్యాపారం హాస్టళ్ల పేరుతో సాగుతోందని ఒప్పుకున్నట్లు సమాచారం.
మూడు కీలక ప్రశ్నలు
ఈ కేసు ప్రభుత్వ యంత్రాంగ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తిస్తోంది. బాలికల హాస్టళ్లపై నిజంగా క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా?, ఇంటికి దూరంగా ఉంటున్న మైనర్ బాలికల భద్రతకు బాధ్యులు ఎవరు?, ఈ ఏజెంట్లు, వారి వెనకున్న నెట్వర్క్పై కఠిన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రతి తల్లిదండ్రికీ హెచ్చరిక
ఇది కేవలం ఒక నేర కథ కాదు. చదువు కలలతో తమ కుమార్తెలను నగరాలకు పంపే ప్రతి కుటుంబానికి ఇది ఓ హెచ్చరిక అని పాట్న ఘటన భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా సమాజం, పాలకులు మేల్కొనకపోతే, భవిష్యత్తు ఆశలతో వచ్చిన మరెన్నో జీవితాలు చీకట్లోకి జారిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.








