బాలీవుడ్ ఫంక్షన్లు, ఈవెంట్లు, పార్టీల్లో తరచూ కనిపించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పవిత్రమైన వైష్ణో దేవి ఆలయంలో అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు అతనితో పాటు మరో ఏడుగురిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఓర్రీ ఇటీవలే తన స్నేహితులతో కలిసి జమ్మూ కశ్మీర్లోని వైష్ణో దేవి మాతా ఆలయాన్ని సందర్శించాడు. యాత్ర సందర్భంగా ఓ హోటల్లో భోజనం చేయడానికి దిగారు. భోజనం చేసిన తర్వాత తమ వెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ను తీసి అక్కడే తాగడం ప్రారంభించారు. ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు వెంటనే ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హోటల్కు వెళ్లి దర్యాప్తు నిర్వహించగా, ఓర్రీతో పాటు అతని స్నేహితులు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి, శ్రీ దర్శన్ సింగ్, శ్రీ పార్థ్ రైనా, శ్రీ రితిక్ సింగ్, శ్రీమతి రాశి దత్తా, శ్రీమతి రక్షిత భోగల్, శ్రీ గుషన్ కోహ్లీ, శ్రీమతి అర్జమస్కినాలపై కేసు నమోదు చేశారు.
జమ్మూ పోలీసులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ, వైష్ణో దేవి తీర్థయాత్ర స్థలం కావడంతో అక్కడ మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. అటువంటి పవిత్ర ప్రదేశంలో చట్టానికి విరుద్ధంగా మద్యం సేవించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓర్రీ అండ్ గ్యాంగ్ను గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కాత్రా ఎస్పీ ప్రకటించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఓర్రీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.