టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ సినిమా(OG Movie)కి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికా (North America) లో ఈ సినిమాను ఆపేస్తున్నట్లు కెనడా (Canada)లోని ప్రముఖ చైన్స్లో ఒకటైన యార్క్ సినిమాస్ ప్రకటించగా, ఇప్పుడు తెలంగాణ (Telangana)లో కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో, టికెట్ ధరల (Ticket Prices) పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇలా వరుస షాకులతో ఓజీ సినిమాపై వస్తున్న నిర్ణయాలు పవన్ అభిమానుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు స్టే ఆర్డర్తో పరిస్థితి మరింత క్లిష్టమైంది.
ఏపీలో రెండు జీవోలు..
ఇక ఏపీలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా కోసం కూటమి ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది. మొదట బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశాలపై జీవో విడుదల చేయగా, తర్వాత మరొక జీవో ద్వారా బెనిఫిట్ షో సమయాన్ని మార్చింది.
25వ తేదీ తెల్లవారుజామున 1 గంటకు అనుమతించిన బెనిఫిట్ షోను, 24వ తేదీ రాత్రి 10 గంటలకు మార్చారు. టికెట్ ధరల విషయంలో ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000గా నిర్ణయించబడింది. రెగ్యులర్ షోస్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125తో పాటు GST అదనం, మల్టీప్లెక్స్లలో రూ.150తో పాటు GST అదనంగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంచిన ధరలు సినిమా రిలీజ్ తేదీ నుంచి 10 రోజులపాటు అమల్లో ఉంటాయని పేర్కొన్న విషయం తెలిసిందే.







