భారత క్రీడా రంగంలో ఒడిశా ప్రభుత్వం మరో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత హాకీ జట్లకు ప్రధాన స్పాన్సర్గా సేవలందించిన ఒడిశా ప్రభుత్వం, ఇప్పుడు ఖోఖోను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. వచ్చే మూడు సంవత్సరాల పాటు, అంటే 2025 నుండి 2027 వరకూ భారత జాతీయ ఖోఖో జట్టుకు స్పాన్సర్గా వ్యవహరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రోత్సాహం కోసం ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున మొత్తం రూ. 15 కోట్లు ఖర్చు చేయనుంది.
దేశీయ క్రీడల పునరుజ్జీవనంలో..
ఒడిశా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడంలో ముందడుగు వేస్తోంది. గతంలో హాకీ జట్టును కూడా ఒడిశా ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇప్పుడు ఖోఖో క్రీడను ప్రోత్సహించడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది. ఖోఖోకు ఆర్థిక మద్దతు మాత్రమే కాకుండా, ఆటగాళ్లను రాబోయే తరాలకు సన్నద్ధం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.