గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడు, సన్నిహిత సహాయకుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) ను అమెరికా నుంచి బహిష్కరించిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. అన్మోల్ 2022 సంవత్సరం నుంచి నకిలీ పాస్పోర్ట్తో దేశం విడిచి పారిపోయి, అమెరికాలో ఉంటూనే జైలులో ఉన్న తన సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్-సిండికేట్కు అమెరికా నుంచి సహాయం అందిస్తున్నట్లు NIA దర్యాప్తులో తేలింది.
అందుకే 2023 మార్చిలోనే NIA అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కుట్ర, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) హత్య వంటి కీలక నేరాలలో ప్రధాన నిందితుడిగా ఉన్న అన్మోల్ను, బుధవారం (నవంబర్ 19, 2025) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన 19వ నిందితుడు అన్మోల్ బిష్ణోయ్.
అమెరికా నుంచి భారత్కు అప్పగించబడిన అన్మోల్ను, ఢిల్లీ విమానాశ్రయంలోనే NIA కస్టడీలోకి తీసుకుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అంతర్జాతీయ నెట్వర్క్ను ఛేదించడంలో ఈ అరెస్ట్ ఒక పెద్ద పురోగతిగా భావిస్తున్నారు. అన్మోల్ను త్వరలో తదుపరి విచారణ కోసం పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు అనుమతితో అతడిని కస్టడీలోకి తీసుకుని, అంతర్జాతీయ నేరాల కార్యకలాపాల గురించి కీలక సమాచారం రాబట్టాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.








