నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రమాదాల నివారణపై వాహనదారులకు పలు సూచనలు చేస్తూ అప్రమత్తం చేశారు. రాచకొండ ఫ్లైఓవర్లను డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు వివరించారు. ఓఆర్ఆర్పై ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలు మరియు భారీ వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.
న్యూయర్ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా చేపడుతున్నామని, దయచేసి ఎవరూ మద్యం సేవించి వాహనాలను నడపవొద్దని కోరారు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కోసం ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సిగ్నల్ జంపింగ్ లేదా ర్యాష్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తారు.
పబ్లు, బార్ల యాజమానుల కోసం మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. మద్యం సేవించిన వారికి ప్రైవేటు వాహనాలు లేదా డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలకు అగౌరవం జరగకుండా చూసుకోవాలని ఈవెంట్ నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. మహిళల కోసం షీ టీమ్స్ పనిచేస్తాయని చెప్పారు.
మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సీపీ సుధీర్బాబు మరోసారి స్పష్టం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ మరియు వేగం పరిమితి ఉల్లంఘనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.