నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో మంత్రుల మధ్య విభేదాలు బయట్టబయలు అయ్యాయి. నెల్లూరు (Nellore)లోని రెండున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన వీఆర్ (వెంకటగిరి రాజా) (VR -Venkata Giri Raja)హైస్కూల్ (High School)ను మునిసిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) హైస్కూల్ (High School)గా పేరు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంతో నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ)(TDP) శ్రేణుల్లో విస్మయాన్ని రేకెత్తించింది. వీఆర్ హైస్కూల్ పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ (Narayana) సమక్షంలో దేవాదాయ మంత్రి ఆనం ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్కూల్ పునఃప్రారంభం కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, “స్కూల్ అభివృద్ధికి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ సహకరిస్తే, అది మునిసిపల్ కార్పొరేషన్ స్కూల్గా ఎలా మారుతుంది? మునిసిపల్ కార్పొరేషన్ నిధులు లేనప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టారు?” అని ప్రశ్నించారు. వీఆర్ హైస్కూల్ పేరు నుంచి ‘మునిసిపల్ కార్పొరేషన్’ (Municipal Corporation) పదాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. “నాడు వెంకటగిరి రాజాస్ నిధులు ఇవ్వకపోయినా, వారి పేరుతోనే కాలేజీ స్థాపించారు. గత 50 ఏళ్లుగా వీఆర్ విద్యా సంస్థలు ఆనం కుటుంబ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థల తరహాలో మార్చడం భావి తరాలకు ఇబ్బందులను కలిగిస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
ఆనం రామనారాయణ రెడ్డి తన కుటుంబం రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ “మా కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉంది. నేను ఎన్టీఆర్ మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశాను. మంత్రి నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చారు. వీఆర్ స్కూల్ను కార్పొరేట్ స్కూల్గా మార్చడం సరికాదు” అని తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తరిస్తున్న వేళ, వీఆర్ హైస్కూల్ను మునిసిపల్ కార్పొరేషన్ స్కూల్గా మార్చడం ద్వారా కార్పొరేట్ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారని ఆనం ఆరోపించారు.
వీఆర్ హైస్కూల్ను నారాయణ తిరిగి తెరిపించి, ఆధునీకరణకు కృషి చేశారని, దీనిని మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్గా ప్రకటించారని టీడీపీ నాయకులు అంటుండగా, ఆనం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వీఆర్ స్కూల్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని పట్టుబట్టారు. ఈ వివాదం రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది. వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ, పేరు మార్పిడిపై ఆనం రామనారాయణ రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలు, నెల్లూరు రాజకీయాల్లో కొత్త ఒడిదుడుకులకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.







