లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ప్రపోజల్ను తీసుకువచ్చారు. అనంతరం టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం నేత ఎస్వీఎస్ఎన్ వర్మ, పలువురు నేతలు సైతం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు సపోర్టుగా నిలిచారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల నుంచి ఈ డిమాండ్లు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఉండవల్లి సీఎం నివాసంలో అమిత్ షాతో సమావేశం సందర్భంగా కూడా ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్పై జనసేన పార్టీ నేతలు, కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్కు సమాన హోదా లోకేష్కు ఇవ్వడానికి వీల్లేదని జనసేన నేతలు తెగేసి చెబుతున్నారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే కూటమిని నిర్వీర్యం చేసినట్లే అవుతుందని చెప్పకనే చెబుతున్నారు.
పవన్కు బీజేపీ అండ
కూటమి సర్కారు కొలువుదీరకముందే అనూహ్యంగా పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. మంత్రివర్గ కూర్పుకు మునుపే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. చంద్రబాబు ఓ నిర్ణయానికి రాకముందే అమిత్ షా ఆ రోజుల్లో ట్వీట్ చేయడం కలకలం రేపింది. బీజేపీ అండదండలతోనే పవన్ కు డిప్యూటీ సీఎం పదవి వచ్చిందన్నది సుస్పష్టం.
లోకేష్ పదవిపై ఆసక్తి కనబర్చని అమిత్ షా
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పెద్దల అంగీకారం లేకుండా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు.. అమిత్ షా వద్ద ప్రతిపాదన చేశారని, దానికి అమిత్ షా ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది. మొత్తం మీద డిప్యూటీ సీఎం కావాలన్న లోకేష్ కోరిక తుపానుగా మారి కూటమి సర్కార్ లో చిచ్చు రేపుతోంది.
కూటమి నేతల గుర్రు
ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినప్పటికీ కేవలం చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేష్ పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం ప్రభుత్వ అధికార యంత్రాగాన్ని లోకేష్ తన గుప్పిట్లో పెట్టుకున్నారనే విమర్శలు లేకపోలేదు. మంత్రులందరి శాఖల్లో వేలు పెట్టడం, తాను చెప్పిందే చేయాలని ఆదేశాలు ఇవ్వడం లాంటి అంశాలన్నీ కూటమి నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని చెప్పుకుంటున్నారు.
పవన్తో సమానమైన హోదాను లోకేష్కు కట్టబెట్టాలనే ఆలోచనను బీజేపీ పెద్దలు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కూటమి ఏర్పాటుకు ముందు నడిచిన పవన్తో పోటీపడేంత స్థాయి లోకేష్ది కాదని అటు బీజేపీ, ఇటు జనసేన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే, పవన్ను సీఎం చేస్తారా అనే ప్రశ్న ఉత్పన్నం కాకపోలేదు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక, మద్యం లాంటి అవినీతి కార్యకలాపాలకు లోకేష్ కేంద్రంగా మారాడన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా లోకేష్ కు ముకుతాడు వేయాలన్నదే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.