రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై వరుసగా జరుగుతున్న సంఘటనలు భయాందోళను కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా వెలుగోడు ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన సంచలనంగా మారింది. సమీప కాలనీకి చెందిన ఓ బాలుడు, ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మాయమాటలతో గడ్డివాము ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన గ్రామస్థుల మధ్య తీవ్ర కలకలం రేపింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
బాధిత బాలిక తీవ్ర అస్వస్థతకు గురైన స్థితిలో తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాలికను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించి బాలుడిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ (POCSO) కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో బాధిత బాలిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అనంతపురంలో మైనర్ బాలికపై 14 మంది గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మరవక ముందే ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.