ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని మైలవరం నియోజకవర్గంలో (Mylavaram Constituency) రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad), వైసీపీ నాయకుడు (YSRCP Leader), మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh)పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ మంటలను రగిల్చారు. “సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇంటిని ముట్టడించే దమ్ము, ధైర్యం ఉన్నవాళ్లెవరైనా రండి. మేం తలుచుకుని ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాల్లేకుండా చేసేవాళ్లం,” అని వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జోగి రమేష్ గతంలో చేసిన తప్పులను మళ్లీ చేస్తానని అన్నట్లైతే “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పినా వినం” అని ఆయన రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జోగి వర్గం మండిపడుతోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మైలవరం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి.
కూటమిపై జోగి విమర్శలు
జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మైలవరంలోని కొండపల్లి మున్సిపాలిటీకి మూడేళ్లుగా పాలకవర్గం లేదు. చెత్త ఊడ్చే పరిస్థితి లేదు, బ్లీచింగ్ వేసే వాళ్లు లేరు. ఇదంతా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసమర్థత వల్లే జరుగుతోంది” అని ఆయన ఆరోపించారు. స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి జోగి రమేష్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మైలవరం నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న వివాదం తీవ్రరూపం దాల్చింది. 2019లో వసంత కృష్ణప్రసాద్ వైసీపీ తరఫున గెలిచినప్పటికీ, జోగి రమేష్తో గ్రూపు రాజకీయాల కారణంగా విభేదాలు తలెత్తాయి. 2024లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి మైలవరం ఎమ్మెల్యేగా గెలవగా, జోగి రమేష్ పెనమలూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం స్థానిక సమస్యల కంటే రాజకీయ ఆధిపత్య పోరుగా మారింది. మైలవరంలో ప్రజల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ విమర్శలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.