మయన్మార్ (Myanmar) లో భూకంపాల ధాటికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం వచ్చిన 7.7, 6.7 తీవ్రతతో భారీ నష్టం జరగగా, శనివారం మరోసారి 4.7 మాగ్నిట్యూడ్తో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదు అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మయన్మార్, థాయ్లాండ్లో భారీగా నష్టం
శుక్రవారం భూకంపం కారణంగా మయన్మార్ (Myanmar), థాయ్లాండ్ (Thailand) దేశాల్లో ఇప్పటికే 1000కి పైగా మరణాలు సంభవించాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్నవారు ఇంకా చాలామంది ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. శుక్రవారం ఏర్పడిన భారీ భూకంపాల తర్వాత కూడా ప్రకంపనలు ఆగలేదు. భారత్ (India), కంబోడియా (Cambodia), చైనా (China), లావోస్ (Laos) వంటి దేశాల్లోనూ భూమి కంపించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
భారత్ సాయం..
భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ (Relief Material) మయన్మార్కు పంపించింది. టెంట్లు, బ్లాంకెట్లు, వాటర్ ప్యూరిఫైయర్స్, మందులను భారత వైమానిక దళం ప్రత్యేక విమానం ద్వారా వీటిని తరలించింది.
భూకంపాలకు కారణం ఏమిటి
మయన్మార్ సాగేంగ్ ఫాల్ట్ లైన్ కారణంగా తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ (Indian Tectonic Plate), బర్మా మైక్రోప్లేట్ (Burma Microplate) మధ్య రాపిడి పెరిగి అధిక శక్తి విడుదల అవుతోంది. ఈ ఫాల్ట్ లైన్ థాయ్లాండ్ వరకు విస్తరించి ఉండటం వల్ల ఆ దేశం కూడా ప్రభావితమైంది. ప్రస్తుతం మయన్మార్ జుంటా ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోరింది. రెస్క్యూ టీములు (Rescue Teams) సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. భవిష్యత్తులో ఇంకా భూకంపాలు సంభవించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.