నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్పై పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనను ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
పోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, అనుమతి లేకుండా కెమెరాలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 132, 223, 296(బి) కింద కేసులు నమోదు చేయగా, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సెక్షన్ 226 ప్రకారం అదనపు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైన సాక్ష్యాలను సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.








