ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది రానుండగా, వారి రవాణా కోసం ప్రభుత్వం 6,600 బస్సులను సిద్ధం చేసింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు అమరావతికి బస్సుల్లో తరలివస్తున్నారు. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను కూడా ఈ కార్యక్రమానికి వినియోగిస్తున్నారు.
బస్సుల్లో ప్రత్యేక సరఫరాలు
ప్రతి బస్సులో: 120 ఆహార ప్యాకెట్లు, 100 అరటిపండ్లు, 120 వాటర్ బాటిల్స్, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 60 మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. మార్గమధ్యంలో అల్పాహారం, సభ ముగిసే సమయానికి డిన్నర్ ఏర్పాట్లు చేస్తారు. ప్రజలు తిరిగి బయలుదేరే సమయానికి భోజనం ఆయా బస్సుల వద్దకు పంపే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంది.
వైద్య సదుపాయాలు
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్యాలరీలో ఆరుగురితో కూడిన వైద్య బృందాన్ని నియమించారు. మార్గమధ్యంలో ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది సిద్ధంగా ఉంటారు.
విజయవంతం చేయాలని పిలుపు
ప్రధాని పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సభ ఏర్పాట్లపై విజయవాడ కలెక్టరేట్లో సమీక్ష జరిగింది. బాపట్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.