బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌కు సీత‌క్క కౌంట‌ర్‌

బండి సంజయ్‌పై సీతక్క ఫైర్

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క (Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) కులగణనపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారని, అయితే దీనిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టి, జనాభా ప్రాతిపదికన సంక్షేమ కార్యక్రమాలు, రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేందుకు కులగణన అత్యంత అవసరమని ఆయన డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే, బీజేపీ నేతలు దీనిని దారి తప్పించేందుకు రాహుల్ గాంధీ మతంపై చర్చ మొదలు పెట్టారని సీతక్క మండిపడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ను కించపరిచేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ విద్వేష రాజకీయాలు
విధ్వంస, విద్వేష రాజకీయాలే బీజేపీ ఎజెండా అని, రాహుల్ గాంధీ శాంతి, సమానత్వం కోసం పనిచేస్తున్నారని వివరించారు. ప్రజలు బీజేపీ ద్వేష ప్రచారాన్ని నమ్మాలా? లేక కాంగ్రెస్ సమానత్వ అభివృద్ధిని స్వీకరించాలా? అనే విషయాన్ని తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. అదానీ ఆస్థుల పెంపకానికి రాహుల్ గాంధీ పనిచేయడం లేదని, సామాజిక న్యాయం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేంద్ర‌మంత్రి బండి సంజయ్, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమ‌ని మంత్రి సీతక్క అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment