ప్రమాదవశాత్తు మంత్రి బాత్రూంలో జారిపడి ఆస్పత్రి పాలైన సంఘటన సంచలనంగా మారింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఉదయం ఆయన తన నివాసంలోని బాత్రూంలో జారిపడి తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ ఘటన తర్వాత ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.
మెదడులో గాయం – పరిస్థితి విషమం
తలకు గాయం అయిన నేపథ్యంలో వైద్యులు స్కాన్ నిర్వహించగా, మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. దీంతో రాందాస్ సోరెన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జంషెడ్పూర్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ మేదాంత ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. మంత్రిని స్ట్రెచర్పై తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. పలువురు నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు మేదాంత్లో ఐసీయూలో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అధికారిక వర్గాల ప్రకారం, రాందాస్ సోరెన్ ఆరోగ్యంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.