ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్మెన్పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి గన్మెన్ జీవీ రమణ గన్ మ్యాగ్జైన్ పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. దీంతో రమణను సస్పెండ్ చేశారు.
గురువారం డ్యూటీ ముగించుకొని తన వద్ద ఉన్న డ్యూటీ రైఫిల్ను పార్వతీపురం జిల్లా కేంద్రంలో అప్పగించారు. ఎప్పటిలాగానే బ్యాగ్లో భద్రపరిచిన గన్ మ్యాగ్జైన్ను ఇవ్వకుండా వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సెంటర్కు వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లారు. అక్కడ తనకు పరిచయమున్న ఆటోడ్రైవర్తో మాట్లాడి, మరో షాప్కు వెళ్లారు. తన చేతిలో సంచిని కింద పెట్టి పనిలో పడ్డారు. పని ముగిసిన అనంతరం సంచి కనిపించకపించలేదు. అందులో 30 బుల్లెట్లు ఉన్నాయంటూ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బ్యాగ్ కోసం గాలిస్తున్నారు.