తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) ఈ బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా, కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజును జార్ఖండ్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమించారు. మరో ఏడుగురు సీనియర్ నేతలకు వివిధ రాష్ట్రాల్లో బాధ్యతలు అప్పగించారు.

పార్టీ పర్యవేక్షణలో మార్పులు
తెలంగాణలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా మాణిక్‌రావ్ థాక్రే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, ఆయన్ను గోవాకు పంపించడంతో పాటు, దీపాదాస్ మున్షీకి తెలంగాణ బాధ్యతలను అప్పగించారు. అయితే, ఆమె పట్ల కొన్ని అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా, పార్టీ నేతలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం, ప్రభుత్వంతో సమన్వయం లోపించడం వంటి అంశాలు విమర్శలకు దారి తీశాయి. దీంతో, కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయి నేతను నియమించాలని నిర్ణయించుకుంది.

మీనాక్షి నటరాజన్ ఎవరు?
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పీజీ, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె 1999లో ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002-2005 మధ్య మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో మంద్‌సౌర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆమె, 2014, 2019లో ఓటమి చవిచూశారు. అయినా, రాహుల్ గాంధీ బృందంలో కొనసాగుతూ భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్రలో కీలక పాత్ర పోషించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment