మేడారం మహాజాతర ఈ ఏడాది అంగరంగ వైభవంగా సాగి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్షలాది మంది భక్తులు వనదేవతలైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో మేడారం అడవులు జనసంద్రంగా మారాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన సమ్మక్క–సారలమ్మ తల్లులకు భక్తులు బంగారం, నగదు, కానుకల రూపంలో తమ భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో మహాజాతరలో సమర్పించిన హుండీల లెక్కింపును నేటి నుంచి ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మేడారం నుంచి ఆర్టీసీ కార్గో ద్వారా మొత్తం 827 హుండీలను హనుమకొండకు తరలించగా, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హుండీల లెక్కింపుకు 15 రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత మహాజాతరలో రూ.15 లక్షలకు పైగా ఆదాయం లభించగా, ఈసారి భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. హుండీల లెక్కింపులో సుమారు 100 మంది సిబ్బంది పాల్గొననుండగా, భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టంగా చేపట్టారు.








