మణిపూర్ (Manipur)లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఆపరేషన్లో భారీగా ఆయుధాలు (Weapons), పేలుడు పదార్థాలు (Explosive Materials) స్వాధీనం చేయడం సంచలనం సృష్టించింది. శనివారం ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, తౌబాల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో నిర్వహించిన మెరుపుదాడుల్లో మొత్తం 90కి పైగా తుపాకులు, వందలాది బుల్లెట్లు, గ్రెనేడ్లు, మోర్టార్లు, ఐఈడీలు భద్రతా బలగాల చేతిలో చిక్కాయి. మణిపూర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), అస్సాం రైఫిల్స్ (Assam Rifles) బలగాలు సంయుక్తంగా ఈ దాడులు చేపట్టాయి.
ఈ ఆపరేషన్కి నిఘా ఆధారంగా ఐజీ కబీబ్ (IG Kabeeb) నేతృత్వం వహించగా, స్వాధీనం చేసిన ఆయుధాల్లో 3 ఏకే సిరీస్ రైఫిల్స్, 1 ఎంఎ16, 5 ఐఎన్ఎస్ఎస్, 4 ఎస్ఎల్ఆర్, 7 పిస్టల్స్, 20 కార్బైన్లు, 8 ఇతర రైఫిల్స్, 20 సింగిల్ బోర్ గన్స్, లాథోడ్ గన్, మోర్టార్లు, గ్రెనేడ్లు, ఐఈడీలు, ట్యూబ్ లాంచర్లు, మ్యాగజైన్లు, వైర్లెస్ హ్యాండ్ సెట్స్ ఉన్నాయి. మొత్తం 728 బుల్లెట్లు (Bullets) కూడా స్వాధీనం అయ్యాయి. ఈ ఆయుధాలు స్థానికంగా ఉగ్రదళాలు, వేర్పాటువాదులు ఉపయోగించే అవకాశం ఉండటంతో, ఈ ఆపరేషన్ విజయవంతంగా జరగడం భద్రతా పరంగా చారిత్రక విజయంగా భావిస్తున్నారు.
గత రెండేళ్లుగా మణిపూర్లో తెగల మధ్య తీవ్ర ఘర్షణలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ చర్యను చేపట్టింది. భద్రతా బలగాల స్పష్టమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆయుధాల స్వాధీనం వల్ల హింసాకాండను నియంత్రించేందుకు ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రతా దళాలు మరిన్ని కసరత్తులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.








