ఇటీవల వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. కర్నూలు బస్సు ఘోర ప్రమాదం మొదలు కొని, తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఈ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు దగ్ధమైంది.
విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఉదయం 7.45 గంటల సమయంలో ఆంధ్రా–ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న సమయంలో బస్సులో నుంచి పొగ రావడం గమనించిన డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డుపక్కన నిలిపి ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు.
తర్వాత క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో ఆ రూట్లో కొద్ది సేపు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిట్నెస్ పరీక్షలు చేయించిన అనంతరం బస్సులను రోడ్డు మీదకు రానివ్వాలని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని బస్సులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.








