మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మంచు మనోజ్, ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కారు. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక షాకింగ్ వీడియో విడుదల చేశారు.
నన్ను భయపెట్టలేరు
తిరుపతి ఘటన తర్వాత మరోసారి స్పందించిన మనోజ్, తన పోరాటాన్ని దారి తప్పించేందుకు తనపై బోగస్ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తన భార్య భూమా మౌనికతో కలిపి ఇప్పటివరకు 32 కేసులు బనాయించారని, ఇంకా ఎన్నిసార్లు ఇలా వేధిస్తారో తెలియదని అన్నారు. ఈ జన్మలో తాను ఎవరిని భయపడనని మనోజ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతిలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
తాజాగా ఓ రిసార్ట్లో రాబోయే సినిమా గురించి చర్చిస్తుండగా, పోలీసులు హఠాత్తుగా వచ్చి తనను అడ్డుకున్నారని మనోజ్ వెల్లడించారు. తనతో పాటు ఉన్నవారిని కూడా ప్రశ్నించారని, దీంతో స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరాలు కోరినట్లు చెప్పారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పిస్తానని స్పష్టం చేశారు.