టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రాల్లో ఒకటైన మనసంతా నువ్వే తాజాగా రీ రిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2001 అక్టోబర్లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించి, యువతలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ –హీరోయిన్గా నటించిన రీమాసేన్ జంటకు మంచి పేరు వచ్చింది. 25 సంవత్సరాల తర్వాత సినిమా రీ రిలీజ్ కావడంతో, ముఖ్యంగా నేటి తరం యువతలోనూ మంచి స్పందన కనిపిస్తోంది.
ఉదయ్ కిరణ్ మరణం – మళ్లీ చర్చ
2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్ సందర్భంగా ఆయన కెరీర్, వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో జరిగిన వివాదం మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది.
2003లో ఉదయ్ కిరణ్, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలతో నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో ఇది టాలీవుడ్లో పెద్ద వార్తగా నిలిచింది. అయితే, కొద్ది రోజులకే ఆ నిశ్చితార్థం అనూహ్యంగా రద్దు కావడం మరింత సంచలనం సృష్టించింది. ఈ రద్దుకు గల స్పష్టమైన కారణాలను ఇరు కుటుంబాలు అధికారికంగా వెల్లడించకపోయినా, పలు ఊహాగానాలు, పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రపై కూడా అప్పట్లో వివాదాస్పద ప్రచారం జరిగింది. ఉదయ్ కిరణ్పై పవన్ బెదిరింపులకు దిగారని, గన్ పెట్టి మరీ బెదిరించారని కూడా అప్పుట్లో ఇండస్ట్రీ వర్గాల టాక్ నడిచింది.
కెరీర్పై ప్రభావం?
ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం రద్దు అయిన తర్వాతే ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయని, మెగా ఫ్యామిలీ ఆయనను తొక్కేసిందని ఒక బలమైన ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్టుగానే అప్పట్లో ఉదయ్ కిరణ్కు పెద్దగా సినిమా అవకాశాలు ఉండేవి కావు. ఉదయ్ కిరణ్ కెరీర్ దెబ్బతినడానికి ఈ విభేదాలే కారణమని ఆయన అభిమానులు నేటికీ భావిస్తున్నారు. సినిమా అవకాశాలు రాకుండా ఉదయ్ కిరణ్ను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి, ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారన్న అపవాదు నేటికీ ఉంది. ఉదయ్ కిరణ్ మరణానంతరం చిరంజీవి కూడా స్పందిస్తూ, తనకు ఆయనతో ఎటువంటి విభేదాలు లేవని, మంచి నటుడని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో మళ్లీ చర్చ
‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్తో మరోసారి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ–ఉదయ్ కిరణ్ వివాదం చర్చనీయాంశమైంది. అభిమానులు మెగా ఫ్యామిలీ ఆధిపత్యమే ఉదయ్ కిరణ్ కెరీర్కు అడ్డుగా నిలిచిందని అంటున్నారు. సినిమా రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు ఉదయ్ కిరణ్ను భావోద్వేగంతో గుర్తుచేసుకుంటున్నారు.








