భారతదేశంలో అణు శక్తి రంగానికి కీలకమైన సేవలు అందించిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. రాజగోపాల చిదంబరం భారత అణుశక్తి రంగంలో విశేష సేవలు అందించారు. 1936 నవంబరు 12న చెన్నైలో జన్మించిన చిదంబరం భారత అణుశక్తి రంగంలో చరిత్రాత్మక మైలురాళ్లను సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
1974, 1998లో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల్లో ఆయన కీలకంగా ఉన్నారు. అతను బార్క్ డైరెక్టర్గా, అణు కమిషన్ ఛైర్మన్గా, అలాగే భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేసి దేశానికి అమూల్యమైన సేవలను అందించారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ వంటి అత్యున్నత సత్కారాలు అందుకున్నారు.







