ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో జరుగుతున్న మహా ఆధ్యాత్మిక మహోత్సవం నేటితో ముగియనుంది. బుధవారం మహా శివరాత్రి పర్వదినంతో మహాకుంభమేళా కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి కోట్లాది భక్తులు భారీగా తరలివచ్చి, త్రివేణీ సంగమం పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా.
ఈరోజు మహాశివరాత్రి కావడంతో కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు అమలు చేస్తోంది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్’గా ప్రకటించింది. నిన్న(మంగళవారం) సాయంత్రం నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కుంభమేళా ఎంట్రీ పాయింట్ సమీపంలోని స్నాన వాటికల వద్దే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించాలని అధికారులు సూచిస్తున్నారు. నిత్యావసర సరుకులను తరలించే వాహనాలకు, వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు కల్పించారు. ఈరోజు చివరి రోజు కావడంతో కుంభమేళాకు దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.








