తెలంగాణ (Telangana)లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు లీగల్ నోటీసులు (Legal Notices) పంపించాడు. తనపై అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ ఈ నోటీసులు పంపినట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ (Delhi)లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క, “హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో రాంచందర్ రావు కూడా భాగస్వామే అని, ఆయనే యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. అలాంటి వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమించగలరు?” అంటూ భట్టి వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకీయంగా బీజేపీకి తక్కువచేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేశారంటూ, రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడారంటూ, భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసులు జారీ చేశారు.
ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మంలో భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఖమ్మంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ అంశంపై భట్టి విక్రమార్క ఎలా స్పందిస్తారు? నోటీసుకు ఎదురుగానే నిలుస్తారా లేదా రాజకీయంగా సమాధానమిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం మున్ముందు తెలంగాణ రాజకీయం కదలికలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.








