తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన లావణ్య-రాజ్ తరుణ్ వివాదంలో కీలక వ్యక్తిగా ఉన్న మస్తాన్ సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురి ప్రైవేట్ వీడియోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయి విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య న్యాయవాది నాగూరు బాబు లేఖ రాశారు.
ప్రధాన డిమాండ్లు..
మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని ఆమె లేఖలో పేర్కొంది. మస్తాన్ సాయి గతంలో మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం సహా మొత్తం ఐదు క్రిమినల్ కేసుల కేసులలో నిందితుడిగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి కుటుంబాన్ని ధర్మకర్తలుగా కొనసాగిస్తే దర్గా పవిత్రత, భద్రతకు భంగం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ధర్మకర్త పదవి నుంచి తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
హార్డ్ డిస్క్లో సంచలన అంశాలు
కేసులో విచారణ వేగం పెంచిన నార్కోటిక్స్ పోలీసులు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో డ్రగ్స్ వాడకం సంబంధించిన బెదిరింపు వీడియోలు, అనేక పార్టీలకు సంబంధించిన కీలక సమాచారం బయటపడింది. డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మస్తాన్ సాయి స్నేహితుడు రాహుల్ను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో మస్తాన్ సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా పార్టీల్లో పాల్గొన్న ఎనిమిది మంది యువతులు, పది మంది యువకుల వివరాలను నార్కోటిక్స్ పోలీసులు సేకరిస్తున్నారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూడనుండగా, లావణ్య న్యాయవాది డిమాండ్ నేపథ్యంలో మస్తాన్ దర్గా ధర్మకర్తల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.