జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి సంచలన విషయాలను బయటపెట్టారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కిరణ్ రాయల్ నుంచి తనకు రావాల్సిన నగదు వచ్చేంత వరకు పోరాటం ఆపనని స్పష్టం చేశారు. అదే విధంగా తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఏ నుంచి ఫోన్కాల్స్ వస్తున్నాయని, విజయవాడకు వచ్చి కలవాలని ఫోన్లు వస్తున్నాయని బాధితురాలు లక్ష్మి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తాను వెళ్లదలుచుకోలేదన్నారు.
గత కొంత కాలంగా కిరణ్ రాయల్తో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు అన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు లక్ష్మి వెల్లడించారు. తనకు కిరణ్ రాయల్ ఇవ్వాల్సిన నగదు చెల్లించే వరకు పోరాటం చేస్తానన్నారు. కిరణ్ రాయల్ నుంచి రావాల్సిన లావాదేవీలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
తనకు ఏ పార్టీతో సంబంధం లేదని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి వెల్లడించారు. తాను విడుదల చేసిన వీడియోలు అన్ని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారని చెప్పారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ అండలేదని, తనను అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నారని లక్ష్మి చెప్పారు. తన ఆరోగ్యం బాగోలేదని, తన కుమారులు వద్దని చెప్పినా, రావాల్సిన డబ్బుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో తనను అసభ్యంగా ట్రొల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను విడుదల చేసిన వీడియోలు, ఫొటోలు అన్ని వాస్తవాలు అని చెప్పారు.








