గాంధీభ‌వ‌న్ కార్య‌క‌ర్త ప్ర‌సంగంలా గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌.. – కేటీఆర్

గాంధీభ‌వ‌న్ కార్య‌క‌ర్త ప్ర‌సంగంలా గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌.. - కేటీఆర్

తెలంగాణ బడ్జెట్ స‌మావేశాల‌ ప్రారంభం సంద‌ర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన గవర్నర్ ప్రసంగాన్ని ఖండిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేటీఆర్, ఈ ప్రసంగాన్ని గాంధీభవన్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు.

రైతు రుణమాఫీపై స్పష్టమైన ఆరోపణలు
రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం మించి ఎక్కడా రైతు రుణమాఫీ లేదని కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ పూర్తయిందంటూ గవర్నర్ నోటితో అసత్య ప్రచారం చేయించడం బాధాకరమన్నారు. రైతు బంధు మొత్తం అందిందన్న వ్యాఖ్యాలు కూడా అబద్ధాలేనని ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సీఎం చేతకానితనం వల్లే పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌పై ఉన్న గుడ్డి కోపంతో మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేపట్టడం లేదని ఆరోపించారు.

రాజకీయ ఆరోపణలు, ఆర్థిక పరిస్థితి
కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి భ‌ట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట 20% కమీషన్ నిరసనకు దిగిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.1.13 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. దావోస్‌లో రూ.1.72 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ నోట అనిపించడం పూర్తిగా అబద్ధమని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క పథకం కూడా ప్రారంభం కాలేదని, ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment