అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు కేసీఆర్ కాస్త విరామం ఇచ్చినప్పటికీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్రావు ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. అసెంబ్లీలోనూ, బయట ప్రభుత్వంపై విమర్శణాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇద్దరు నేతలు పార్టీని ముందుండి నడిపిస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయమే.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ‘యాత్రపై ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమవుతాను. ఆ తర్వాత వచ్చే ఏడాది యాత్ర ప్రారంభిస్తాను’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను మరింత చైతన్యవంతం చేసేందుకు ఈ పాదయాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.