చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్ వెంటనే బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రంగరాజన్పై దాడి చేయడం దేవుడిని అవమానించినట్లే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలిఅని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధర్మరక్షకులపై దాడులు చేస్తారు.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు అని కామెంట్స్ చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా.. హోం మంత్రి? ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ కంట్రోల్పై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రంగరాజన్పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆలయ భద్రతను పెంచాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. ఈ ఘటనపై తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. రంగరాజన్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.
రామ రాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొందరు వ్యక్తులు అర్చకుడు రంగరాజన్ను కోరగా, ఆయన నిరాకరించడంతో దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ పోలీసులకు తెలిపారు. దాడిలో అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడిగా వీర రాఘవ రెడ్డిని గుర్తించారు. ఈ దాడికి పాల్పడిన ఏపీకి చెందిన 10 మందిని, తెలంగాణకు చెందిన ఏడుగురిని గుర్తించినట్లుగా తెలుస్తోంది.