బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ ఛాంపియన్ దివ్య దేశ్ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5 తేడాతో పోలాండ్కు చెందిన కులోన్ క్లౌడియాపై విజయం సాధించగా, దివ్య 1.5–0.5 తేడాతో సెర్బియా క్రీడాకారిణి టియోడోరా ఇంజాక్ను ఓడించింది.
ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను మట్టికరిపించింది. ఇంజాక్తో జరిగిన రెండో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్ను హంపి 102 ఎత్తుల్లో డ్రా చేసుకోగా, దివ్య ఇంజాక్తో జరిగిన గేమ్లో 39 ఎత్తుల్లో గెలిచింది.
మూడో రౌండ్లోని రెండు గేమ్లు ముగిసేసరికి భారత్కు చెందిన ద్రోణవల్లి హారిక (గ్రీస్కు చెందిన స్టావ్రూలాతో), వంతిక అగర్వాల్ (రష్యాకు చెందిన కాటరీనా లాగ్నోతో), వైశాలి (అమెరికాకు చెందిన కరిస్సా యిప్తో) 1–1తో సమంగా నిలిచారు. దీంతో ఈరోజు విజేతలను నిర్ణయించడానికి టైబ్రేక్ గేమ్లు నిర్వహించనున్నారు.