తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు, అసంతృప్తి పతాక స్థాయికి చేరాయి. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని ఖర్గే బాంబు పేల్చారు. తనను ఇటీవల కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చల్లో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు వెల్లడించిన వివరాల ప్రకారం.. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమయ్యాడని ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలన గాడితప్పిందని ప్రజల్లో అభిప్రాయం నెలకొన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రుల మధ్య తగువులు, వాటాల లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ సరిగా హ్యాండిల్ చేయకపోవడం పార్టీకి భారీ నష్టం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
“రేవంత్ మొదటి నుంచీ పార్టీలో అందరినీ కలుపుకోలేదు. ఇతర పార్టీలతో సమన్వయం చేయడంలో విఫలమయ్యాడు. బీసీ రిజర్వేషన్ అంశం కాంగ్రెస్కు నష్టాన్ని తెచ్చింది. సంప్రదాయ మద్దతుదారులైన రెడ్డి, దళిత వర్గాలు మనకు దూరమయ్యాయి. ఇక బీసీలు కూడా మనవైపు చూడడం లేదు. రేవంత్ నిర్వాకం వల్ల అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్పై ఆగ్రహంగా ఉన్నారు” అని సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు తెలిపారు.
అంతేకాకుండా, రేవంత్ అనవసరంగా రాహుల్ గాంధీ పేరును ఈ వివాదంలోకి లాగడం రాహుల్ ఇమేజ్కే నష్టం కలిగించిందని ఖర్గే వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.





 



