బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల గడువు ఉండటంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అయితే పాత వారికి మరో అవకాశం ఇస్తారా, కొత్త ముఖాన్ని తెరపైకి తెస్తారా అన్నది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఈ రోజు సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కీలక సూచనలు చేసే ఛాన్స్
ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కీలక నేత హరీశ్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రజా సమస్యలపై ఉద్దేశపూర్వకంగా పోరాటం చేయాలని సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది.