బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Tanneeru Harish Rao) తండ్రి(Father) తన్నీరు సత్యనారాయణ (Tanneeru Satyanarayana) ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హరీశ్ రావు నివాసానికి చేరుకున్నారు. అక్కడ సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భర్తను కోల్పోయిన తన అక్క లక్ష్మమ్మ (Lakshmamma)ను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావును కౌగిలించుకుని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతకుముందు, కేసీఆర్ హరీశ్ రావుకు ఫోన్ చేసి కూడా పరామర్శించారు.
సత్యనారాయణ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా హరీశ్ రావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని వారంతా ప్రార్థించారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్లోని క్రిన్స్ విల్లాస్లో సందర్శనార్థం ఉంచగా, అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.








