తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన టాస్మాక్ స్కామ్ (TASMAC Scam) ఇప్పుడు సినీ రంగానికీ తాకుతోంది. ఈ కుంభకోణం నిందితులతో సంబంధాల విషయంలో నటి కయాదు లోహర్ (Kayadu Lohar) పేరూ తెరపైకి వచ్చింది. సంబంధిత నిందితులు నిర్వహించిన కొన్ని నైట్ పార్టీల్లో కయాదు పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ పార్టీలకు హాజరైనందుకుగాను ఆమె రూ.35 లక్షలు పారితోషికంగా తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డ్రాగన్ సినిమాతో ఇటీవల ఫేమస్ అయిన కయాదు లోహర్ కుర్రకారు మనసు దోచుకుంది. కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తన గ్లామర్, నటనకు ఫ్యాన్స్ను ఫిదా చేసింది. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. కోలీవుడ్లో యంగ్ హీరోలు అధర్వ, జీవి ప్రకాశ్ల సినిమాల్లో నటిస్తోంది. కయాదు లోహర్పై సంచలన ఆరోపణలు బయటకు రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ఈ అమ్మడుకు టాస్మాక్ స్కామ్కు సంబంధించిన ఆరోపణలు ఆమె సినీ కెరీర్పై ప్రభావం చూపిస్తాయా? అనే చర్చ పరిశ్రమలో సాగుతోంది.
టాస్మాక్ కేసు..
తమిళనాడు ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం సంస్థ TASMAC. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, డిస్టిలరీ యజమానులతో కూడిన నెట్వర్క్ తారుమారు చేసిన టెండర్లు, పెంచిన ఖర్చులు, అక్రమ లావాదేవీల ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈ ఏడాది మార్చి నుంచి టాస్మాక్పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తమిళనాడు ఎక్సైజ్ మంత్రి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలు, నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి EDని ఉపయోగిస్తోందని అన్నారు.