42 శాతం రిజర్వేషన్ల (Reservations) సాధన డిమాండ్తో బీసీ సంఘాలు (BC – Associations) నేడు (శనివారం) తెలంగాణ (Telangana) బంద్ (Strike)కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు తెలంగాణ జాగృతి (Telangana Jagruti ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహార కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
తల్లి కవితతో కలిసి నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య (Aditya).. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు. ఈ సందర్భంగా ఆదిత్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అని పేర్కొన్నాడు.
బీఆర్ఎస్(BRS) వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నొచ్చుకున్న కవిత ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల నడుమ.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవల ఇండియాకు వచ్చాడు. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో ఆయన పాల్గొనడం గమనార్హం. కేవలం 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.








