తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై మరోసారి రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం మహిళలు, వృద్ధులు, విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. నగరంలోని ప్రజా భవన్ వద్ద భారీ ధర్నాకు పిలుపునిస్తూ మహిళలతో కలిసి ఆందోళన చేపట్టారు.
హామీలు వెంటనే అమలు చేయాలి
మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున, గత 26 నెలల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి సహాయం తో పాటు తులం బంగారం ఇవ్వాలని, వృద్ధులు-దివ్యాంగులు-ఒంటరి మహిళల పెన్షన్ను రూ.4 వేలుకు పెంచుతూ వెంటనే జీఓ జారీ చేయాలని కోరారు. కాలేజీ విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీ నెరవేర్చలేదని కూడా ఆమె విమర్శించారు. అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
బడ్జెట్లో నిధులు కేటాయించాలి
రాబోయే బడ్జెట్లో సంక్షేమ పథకాలకు సరిపడ నిధులు కేటాయించాలని, మాటలకే పరిమితం కాకుండా అమలులో చూపాలని కవిత హెచ్చరించారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని విస్మరించకూడదని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు.








