ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఎల్బీనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేసిన కవిత, పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమకాలం నుంచి నేటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైంది” అనే వ్యాఖ్యపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రజలు ఏనాడూ దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది, మేము పెద్దగా ఆలోచిస్తాం,” అని ఆమె అన్నారు.
‘పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు’: కవిత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా, తాము ఎప్పుడూ ‘జై తెలంగాణ, జై ఆంధ్రా’ అనే కోరుకున్నామని, తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్రా కూడా అంతే బాగుండాలని ఆకాంక్షించామని కవిత స్పష్టం చేశారు. “ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్లో కూడా మాట్లాడాను. పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు,” అని ఆమె వివరించారు. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని గుర్తు చేస్తూ, “మా బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప, ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదు,” అని కవిత పేర్కొన్నారు.








