రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు (సవరణ) బిల్లు 2025కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రి జీతం నెలకు రూ.1,50,000, మంత్రులకు రూ.1,25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరగనుంది. పెన్షన్లు కూడా భారీగా పెరగనున్నాయి. రూ.55,000 నుంచి రూ.95,000కు చేరుకునే అవకాశముంది. ఇదే విధంగా ప్రయాణ భత్యాలు, వైద్య, టెలిఫోన్, పోస్టల్ ఖర్చులకూ పెంపు ప్రతిపాదించారు.
ఆర్థిక సంక్షోభంలో జీతాల పెంపు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో జీతాల పెంపుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, మంత్రి ఎంబీ పాటిల్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు ప్రపంచంలోనే అత్యధిక జీతాలు పొందుతుండటంతో, ఎమ్మెల్యేల జీతాలు పెంచడం తప్పేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ నిర్ణయం ప్రజలకు మేలు చేసేది కాదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.