కడప నగరపాలక సంస్థ (Kadapa Municipal Corporation) (కడప కార్పొరేషన్) సర్వసభ్య సమావేశం (General Body Meeting) ఆసక్తికరంగా మారింది. కడప టీడీపీ (Kadapa TDP) ఎమ్మెల్యే(MLA) రెడ్డప్పగారి మాధవిరెడ్డి (Reddappagari Madhavireddy) – మేయర్ సురేష్ బాబు (Mayor Suresh Babu) మధ్య కుర్చీ కేటాయింపు విషయంలో ఏడాదిగా నడుస్తున్న పోరు మరింత ఉద్ధృతమైంది. ఎట్టకేలకు మేయర్ స్థానం పక్కనే ఎమ్మెల్యేలకు కొత్తగా సీట్లు కేటాయించడం సంచలనంగా మారింది. అంతేకాకుండా కుర్చీలు (Chairs) వేసి బయటకు పొక్కకుండా సమావేశ మందిరానికి తాళం వేశారు.
మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు ఎక్స్-అఫిషియో సభ్యులుగా సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లతో పాటు కూర్చోవాలి. అయితే, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ పక్కనే వేదికపై కుర్చీ కావాలని గత ఏడాదిగా పట్టుబడుతున్నారు. ఈ రోజు జరగాల్సిన సమావేశంలో ఆమెకు మేయర్ సురేష్ బాబు పక్కనే కుర్చీ కేటాయించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మేయర్ పక్కనే కుర్చీ వేయించుకుని, దానికి బోల్టులు కూడా బిగించుకున్నారని వైసీపీ సభ్యులు విమర్శించారు.
తాళం తెరవని మీటింగ్ హాల్
గత రెండు నెలలుగా సమావేశ మందిరం తాళం వేసి ఉంచిన అధికారులు, నేడు ఉదయం 11 గంటలకు జరగాల్సిన సమావేశం కోసం కూడా తాళం తీయలేదు. ఈ విషయంపై వైసీపీ సభ్యులు (YSRCP Members) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “అధికారులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నిబంధనలను కాలరాస్తున్నారు. సమావేశం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు. మేయర్ సురేష్ బాబు కమిషనర్కు నోటీసులు జారీ చేస్తూ, “సమావేశ మందిరం తాళం తెరవకపోతే సమావేశం ఎలా నిర్వహించాలి? మందిరం కాకుండా కార్పొరేషన్ కార్యాలయంలో ఎక్కడ సమావేశం పెట్టాలో చెప్పాలి” అని ప్రశ్నించారు.
ప్రభుత్వం, పోలీసుల జోక్యం
మున్సిపల్ ఆక్ట్ (Municipal Act) ప్రకారం, ఆరు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే కార్పొరేషన్ కమిటీ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమావేశం జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు ఘర్షణలకు తావిస్తోందని వైసీపీ(YSRCP) ఆరోపిస్తోంది. సమావేశం జరగకుండా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావించిన మేయర్, కోర్టు ఆశ్రయించి భద్రత కల్పించాలని కోరారు. దీంతో నేడు సమావేశం వేదిక వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.