భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)(BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే (Jubilee Hills MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) (62) ఆదివారం ఉదయం 5:45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) చికిత్స పొందుతూ కన్నుమూశారు (Passed Away). జూన్ 5న తీవ్రమైన గుండెపోటుతో (Severe Heart Attack) ఆస్పత్రిలో చేరిన ఆయన, వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మరణించారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ (MLA Gopinath), ఈ ఏడాది ఫిబ్రవరిలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. మాగంటి గోపీనాథ్ మరణం తెలంగాణ రాజకీయ వర్గాల్లో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న హైదరాబాద్లోని హైదర్గూడలో మాగంటి కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు. 1983లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్థాపన నాటి నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, 1985లో టీడీపీ యువజన విభాగమైన తెలుగు యువత అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1987-1989 మధ్య హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా, 1988-1993 మధ్య హైదరాబాద్ జిల్లా కన్స్యూమర్ ఫోరమ్ సభ్యుడిగా పనిచేశారు. 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరి 2018, 2023 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ భారత క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ను 16,337 ఓట్ల తేడాతో ఓడించారు.
చిత్రపరిశ్రమలోనూ తనదైన ముద్ర
రాజకీయాలతో పాటు, మాగంటి గోపీనాథ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (Telugu Film Industry) కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ‘పాత బస్తీ’ (1995), ‘రావణ’ (2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైల్ ఏ వేరు’ (2009) వంటి చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. టాలీవుడ్లో బలమైన సంబంధాలు కలిగిన ఆయన, ఎన్టీ రామారావు, సూపర్స్టార్ కృష్ణ అభిమానిగా తన రాజకీయ, సినీ జీవితాన్ని సమన్వయం చేసుకున్నారు.
ప్రముఖుల సంతాపం
మాగంటి మరణ వార్త తెలిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, మాజీ మంత్రి టి. హరీష్ రావు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు.