జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) ఖరారు చేశారు.
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలోనే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచార సభలలో ఆమె పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఆమోదంతో పార్టీ ఈ ప్రకటనను అధికారికం చేసింది. అయితే, ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ను విడుదల చేయలేదు.







