క్రీడా ప్రపంచంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి (India) ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ అంతర్జాతీయ జియు-జిట్సు (Jiu-Jitsu) క్రీడాకారిణి రోహిణి కలాం (Rohini Kalam) (35) ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని దేవాస్ (Dewas)లో రాధాగంజ్లోని తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకున్నారు.
రోహిణి సోదరి రోష్ని కలాం అందించిన సమాచారం మేరకు.. రోహిణి కలాం అష్టాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్గా పనిచేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె కనిపించిందని సోదరి వెల్లడించారు. పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు తరచూ ఇబ్బంది పెడుతున్నట్లు రోహిణి ఫోన్లో మాట్లాడడం విన్నానని రోష్ని పోలీసులకు తెలిపారు.
ఆత్మహత్యకు కొద్ది నెలల ముందు రోహిణికి శస్త్ర చికిత్స జరగడం, అనారోగ్యంతో బాధపడుతుండటం, దీనికితోడు పని ఒత్తిడి పెరగడం వల్లనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కెరీర్ ప్రస్థానం
రోహిణి కలాం 2015లో ప్రొఫెషనల్ జియు-జిట్సు కెరీర్ను ప్రారంభించారు. హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలలో ఆమె భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 2022 థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్లో కాంస్యం, 2024 ఆసియా జియు-జిట్సు ఛాంపియన్షిప్లో మరో కాంస్యం సాధించి దేశానికి గుర్తింపు తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రోహిణి కలాం మృతి పట్ల భారతీయ క్రీడా సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.





 



