ఓ వివాహ వేడుకకు హాజరైన బాలిక గ్యాంప్ రేప్కు గురైన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో ఈ దుర్మార్గపు ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత, పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
సుర్సాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో శనివారం వివాహ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిమ్డేగా జిల్లా నుండి బారాత్ వచ్చింది. ఈ వివాహానికి వచ్చిన నలుగురు బాలికలు రాత్రి 9 గంటల సమయంలో ఒంటరిగా ఇళ్లకు వెళ్తున్నారు. దారిలో ఆరుగురు యువకులు వారితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. ముగ్గురు బాలికలు అక్కడి నుండి తప్పించుకుని పారిపోగా, ఒక బాలికను నిందితులు బలవంతంగా అడవి వైపు తీసుకెళ్లారు. ఆరుగురు యువకులు ఆమెపై వరుసగా అత్యాచారం చేశారు. ఈ సమయంలో బాలిక స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించిన నిందితులు ఆమెను అడవిలోని పొదల్లో విసిరేశారు.
కాసేపటి తరువాత స్పృహలోకి వచ్చిన బాలిక ఏదో విధంగా ఇంటికి చేరుకుంది. జరిగిన ఘటనను ధైర్యంగా తండ్రికి వివరించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. యువకులు తాము చేసిన నేరాన్ని అంగీకరించగా, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. బాధితురాలి వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.