తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు జయం రవి (రవి మోహన్) (Ravi Mohan) ఆయన భార్య ఆర్తి రవి (Aarthi Ravi) మధ్య విడాకుల కేసు(Divorce Case) కోలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ దంపతులు తమ 15 సంవత్సరాల వైవాహిక బంధాన్ని ముగింపు పలికేందుకు చెన్నై(Chennai)లోని ఫ్యామిలీ కోర్టు(Family Court)కు బుధవారం హాజరయ్యారు. ఈ విచారణలో జయం రవి, ఆర్తితో తమ సంబంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని, విడాకులు కోరుతున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ఇదే సమయంలో, ఆర్తి రవి తన భర్త నుండి నెలకు రూ.40 లక్షల భరణం (Alimony) కోరుతూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 12కు కోర్టు వాయిదా వేసింది.
జయం రవి- ఆర్తి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్ (14), అయాన్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఈ దంపతులిద్దరూ చెన్నై ఫ్యామిలీకోర్టులో డైవర్స్ కోసం అప్లయ్ చేశారు. తాజా విచారణలో భాగంగా.. భర్త రవి నుంచి తనకు నెలకు రూ.40 లక్షల భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఆర్తి. ఇది విడాకుల తర్వాత తన ఆర్థిక అవసరాలకు అవసరమని పేర్కొన్నారు. ఈ డిమాండ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు అతిగా భావిస్తూ విమర్శించగా, మరికొందరు ఆర్తి హక్కుల కోసం పోరాడుతున్నారని సమర్థించారు.
ఈ కేసు 2024 సెప్టెంబర్ నుండి చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో నడుస్తోంది. నవంబర్ 2024లో, కోర్టు ఈ దంపతులను మధ్యవర్తిత్వ కేంద్రంలో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది, సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించింది. నవంబర్ 28, 2024న హైకోర్టు రీకాన్సిలియేషన్ సెంటర్ (High Court Reconciliation Center)లో ఒక గంటకు పైగా జరిగిన చర్చల్లో ఇరుపక్షాలు తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. అయితే, ఈ చర్చలు ఫలవంతం కాలేదు, తాజాగా ఆర్తి భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా, ఇప్పుడీ కేసు జూన్ 12కి వాయిదా పడింది.








